Saturday, June 3, 2023

WTC Final 2023 విజేతకి రూ.13.23 కోట్ల ప్రైజ్‌మనీ.. ఐసీసీ ప్రకటన

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ విజేతకి రూ.13.23 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వబోతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈరోజు అధికారికంగా ప్రకటించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్ వేదికగా ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే కొంత మంది భారత క్రికెటర్లు ఇంగ్లాండ్‌కి వెళ్లిపోగా.. ఈ నెల 28న ఐపీఎల్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత మిగిలిన ప్లేయర్లు కూడా వెళ్లనున్నారు.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి ఆదరణ పెరిగినప్పటికీ ఫస్ట్ ఎడిషన్‌లో ఇచ్చినంత ప్రైజ్‌మనీనే ఈ ఎడిషన్‌లోనూ ఇవ్వబోతున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. 2019-2021 ఎడిషన్‌లో న్యూజిలాండ్ టీమ్ విజేతగా నిలవగా.. అప్పట్లో కివీస్‌కి రూ.13.23 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. అలానే రన్నరప్‌గా నిలిచిన భారత్ జట్టుకి రూ.6.61 కోట్లని ఐసీసీ ఇచ్చింది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2021-2023) ఎడిషన్‌ కోసం ఓవరాల్‌గా రూ.31.4 కోట్ల ప్రైజ్‌మనీని ఐసీసీ కేటాయించింది. ఇందులో విజేత, రన్నరప్‌కి పెద్ద మొత్తంలో దక్కనుండగా.. ఆ తర్వాత టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో ప్లేస్ ఆధారంగా మిగిలిన ఏడు జట్లకీ ఐసీసీ పంచబోతోంది. మొత్తం 9 టెస్టు దేశాలు ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మ్యాచ్‌లు ఆడాయి.

Latest news
Related news