Thursday, June 1, 2023

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య వన్డే సిరీస్‌పై సందిగ్ధత.. పునరాలోచనలో బీసీసీఐ

భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జూన్‌లో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌పై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 28న ఫైనల్‌తో ఐపీఎల్ 2023 సీజన్ ముగియనుండగా.. ఆ తర్వాత భారత క్రికెటర్లు ఇంగ్లాండ్‌కి బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ ఆస్ట్రేలియాతో జూన్ 7 నుంచి 11 వరకు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ని భారత్ జట్టు ఆడనుంది. ఈ ఫైనల్ ముగిసిన తర్వాత జూన్ 20 నుంచి అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌, జులై 7 నుంచి వెస్టిండీస్‌ పర్యటనకి టీమిండియా వెళ్లేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షెడ్యూల్ రూపొందించింది.

కానీ.. అఫ్గానిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ని ఆడేందుకు భారత క్రికెటర్లు కొంతమంది విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా భారత్ జట్టు మ్యాచ్‌లు ఆడుతోంది. అలానే ఐపీఎల్ 2023లో ఆటగాళ్లు బిజీగా గడిపారు. ఆ వెంటనే ఆస్ట్రేలియతో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడబోతున్నారు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్, వెస్టిండీస్ పర్యటన.. ఈ రెండు టూర్లు ముగిసిన వెంటనే ఆసియా కప్ -2023, అనంతరం వన్డే ప్రపంచకప్ -2023 జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్‌ టైమ్‌కి ప్లేయర్లకి రెస్ట్ దొరికే సూచనలు కనిపించడం లేదు. దాంతో బీసీసీఐ కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత దాదాపు మూడు వారాలు ప్లేయర్లకి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. జూన్ 11న ఈ ఫైనల్ ముగియనుండగా.. ఆ తర్వాత జులై 7న విండీస్ టూర్ ప్రారంభంకానుంది. వెస్టిండీస్ గడ్డపై రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లని టీమిండియా ఆడనుంది. దాంతో ఈ సుదీర్ఘ సిరీస్‌కి ముందు ప్లేయర్లకి తగినంత రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌‌తో సిరీస్‌ని రద్దు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Latest news
Related news