దేశీయ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంకుకు కొద్ది రోజుల క్రితం భారీ షాక్ ఇచ్చింది. మానిటరీ పాలసీ నిబంధనలు, ఇతర రూల్స్ ఉల్లంఘించినందుకు గానూ భారీగా పెనాల్టీ వేసింది. ఏకంగా రూ.2.92 కోట్లు జరిమానా కట్టాలని ఆదేశించింది. ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్తో వడ్డీ రేట్లను లింక్ చేయకపోవడం, అర్హత లేని సంస్థల పేరుపై సేవింగ్స్ అకౌంట్లు తెరవడం వంటి వాటికి పాల్పడుతూ నిబంధనలకు బ్యాంకు తూట్లు పొడిచినట్లు ఆర్బీఐ గుర్తించింది. ఈ కారణంతోనే భారీగా జరిమానా వేసినట్లు తెలిపింది.
మరోవైపు.. మే నెలలలో పలు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. కస్టమర్లకు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రెపో రేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. గత ఏడాది మే నుంచి 250 బేసిస్ పాయింట్లు పెంచి రెపో రేటును 6.50 శాతానికి చేర్చింది. గత ఏడాది మేలో ఇది 4 శాతంగా ఉండేది. వడ్డీ రేట్లలో రిజర్వ్ బ్యాంక్ మార్పులు చేయని క్రమంలో బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను అలాగే కొనసాగిస్తున్నాయి. కొన్ని మాత్రం పెంచుతున్నాయి. మే నెలలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన వాటిలో డీసీబీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వంటివి ఉన్నాయి.
- Read Latest Business News and Telugu News