ఏ ఆటగాడికైనా వరల్డ్ కప్ ఆడటం కల. యువరాజ్ లాంటి ఆటగాడు కేన్సర్తో పోరాడుతూనే 2011లో టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. అయ్యర్ కూడా ఎలాగైనా సరే వరల్డ్ కప్ ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. సర్జరీ చేయించుకుంటే ప్రపంచ కప్కు దూరంగా ఉండిపోయే ప్రమాదం ఉండటంతో ఇప్పుడే సర్జరీ చేయించుకోవద్దని శ్రేయస్ అయ్యర్ డిసైడయ్యాడు. వన్డే వరల్డ్ కప్ ఆడటం కోసం బీసీసీఐ సలహాకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాడు. అందుకే వెన్ను సమస్యను సరి చేసుకోవడానికి సర్జరీ చేయించుకోవాలన్న నేషనల్ క్రికెట్ అకాడమీ సూచనను అయ్యర్ తిరస్కరించాడు. వెన్ను నొప్పిని తగ్గించడం కోసం ఇటీవలే అయ్యర్కు ఆరు ఇంజెక్షన్లు ఇచ్చారు.
డాక్టర్ల సలహాతో శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు ఆయుర్వేద చికిత్స పొందుతున్నాడు. ఐపీఎల్ మొత్తానికీ అయ్యర్ దూరం అవుతాడని భావించగా.. అతడు సర్జరీని వాయిదా వేసుకోవడంతో.. ప్రీమియర్ లీగ్ తొలి అర్ధ భాగానికి అతడు దూరమయ్యే అవకాశం ఉంది. వైద్య నిపుణుల సలహా మేరకు నొప్పి తగ్గడం కోసం అయ్యర్ ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత మెల్లగా ఎక్సర్సైజ్లు ప్రారంభించనున్నాడు.
అయ్యర్ ఇంతకు ముందు కూడా ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆశ్రయించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్కు ముందు రిహాబిలిటేషన్లో ఉన్న అయ్యర్.. ఆక్యుపంక్చర్ చికిత్స పొందాడు. వెన్ను సమస్య కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకు అయ్యర్ దూరం కానుండటంతో.. కోల్కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్ను నియమించనుంది. నితీశ్ రాణా, టిమ్ సౌథీల్లో ఒకరు కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశం ఉంది.