Thursday, March 30, 2023

Delhi Capitals : గెలుపు ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్ బోల్తా.. గుజరాత్ అనూహ్య విజయం

ముంబయి వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023 (WPL 2023)లో గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) మళ్లీ పుంజుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)తో బ్రబౌర్న్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‌లో ఆకట్టుకున్న గుజరాత్ టీమ్ 11 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. లీగ్‌లో ఆరో మ్యాచ్ ఆడిన గుజరాత్ టీమ్‌కి ఇది రెండో గెలుపుకాగా.. ఢిల్లీ టీమ్‌కి ఇది రెండో ఓటమి.

మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీమ్ 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఆ టీమ్‌లో వోల్వార్డెట్ (57: 45 బంతుల్లో 6×4, 1×6), గార్డ్‌నర్ (51 నాటౌట్: 33 బంతుల్లో 9×4) అర్ధశతకాలు నమోదు చేశారు. ఆ తర్వాత 148 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ టీమ్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ మెక్ లానింగ్ (18), షెఫాలి వర్మ (8), క్యాప్సీ (22), జెమీమా రోడ్రిగ్స్ (1), జాన్‌సెన్ (4) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. కానీ.. కాప్ (36: 29 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడగా.. చివర్లో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి (25: 17 బంతుల్లో 4×4) సమయోచితంగా ఆడింది.

అరుంధతి రెడ్డి క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీ జట్టు గెలిచేలా కనిపించింది. కానీ.. టీమ్ స్కోరు 135 వద్ద 9వ వికెట్‌గా ఆమె ఔటైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పూనమ్ యాదవ్ (0) కనీసం సింగిల్ కూడా తీయలేకపోయింది. దాంతో శిఖ పాండే (8) నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోనే అలానే ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి ఢిల్లీ టీమ్ 18.4 ఓవర్లలో 136 పరుగులకి ఆలౌటైంది. ఢిల్లీ టీమ్‌లో కాప్, క్యాప్సీ రనౌట్‌గా వెనుదిరిగారు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news