Friday, March 31, 2023

Smriti Mandhana : ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మళ్లీ ఫెయిల్.. ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో ఫైర్!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ -2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ విఫలమైంది. యూపీ వారియర్స్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 136 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు టీమ్ ఆరంభం నుంచే వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ సోఫియా (14: 6 బంతుల్లో 2×4, 1×6) ఫస్ట్ ఓవర్‌లోనే దూకుడుగా ఆడి మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా.. కెప్టెన్ స్మృతి మంధాన కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది.

ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన యూపీ వారియర్స్ స్పిన్నర్ దీప్తి శర్మ బౌలింగ్‌లో బ్యాట్‌ని అడ్డంగా ఊపేసిన స్మృతి మంధాన (0: 3 బంతుల్లో) క్లీన్ బౌల్డ్ అయ్యింది. వాస్తవానికి భారత్ జట్టుకి స్మృతి, దీప్తి శర్మ చాలా రోజుల నుంచి ఆడుతున్నారు. దాంతో నెట్స్‌లో లెక్కకి మించి దీప్తి శర్మ బౌలింగ్‌ని స్మృతి ఎదుర్కొని ఉంటుంది. కానీ.. ఆమె బౌలింగ్‌లో మరీ పేలవంగా వికెట్ సమర్పించుకోవడం ఆర్సీబీ అభిమానులకి కోపం తెప్పిస్తోంది. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు.. డబ్ల్యూపీఎల్ 2023 సీజన్‌లో స్మృతి కనీసం ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ లేదా గెలిపించే ఇన్నింగ్స్ ఆడలేకపోయింది.

డబ్ల్యూపీఎల్ 2023 ప్లేయర్ల వేలంలో రూ.3.4 కోట్లకి స్మృతి మంధానాని ఆర్సీబీ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. వేలంలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ స్మృతినే. కానీ.. సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన ఈ స్టార్ ఓపెనర్ చేసిన స్కోర్లని వరుసగా పరిశీలిస్తే? 35, 23, 18, 4, 8, 0. ఈ ప్రభావం ఆర్సీబీ టీమ్‌పైనా పడి ఆ జట్టు వరుస పరాజయాల్ని చవిచూస్తోంది. మరోవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పటికే ఐదు మ్యాచ్‌లాడి మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. అలానే మూడు గెలిపించే ఇన్నింగ్స్‌లతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్‌ని అందుకుంది. ఆ జట్టుని ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిపించుకుంది. దాంతో ఆమెతో పోలికని తీసుకొస్తూ ఆర్సీబీ అభిమానులు స్మృతిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Latest news
Related news