Friday, March 24, 2023

IND vs AUS వాంఖడే వన్డేకి దూరంగా రోహిత్ శర్మ.. అసలు కారణమిదే

Why Rohit Sharma will not play the 1st ODI: ఆస్ట్రేలియాతో వాంఖడే వేదికగా శుక్రవారం జరగనున్న తొలి వన్డేకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూరంగా ఉండనున్నాడు. ముంబయిలోని వాంఖడే (Wankhede) స్టేడియం రోహిత్ శర్మకి సొంత మైదానం. దానికి తోడు సుదీర్ఘకాలంగా ముంబయి ఇండియన్స్ టీమ్‌కి ఐపీఎల్‌ (IPL)లో ఆడుతున్న హిట్‌మ్యాన్‌కి వాంఖడే స్టేడియం కొట్టినపిండి. దాంతో రోహిత్ శర్మ టీమ్‌లో లేకపోవడం తొలి వన్డేలో భారత్ జట్టుకి పెద్ద లోటు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టీమ్‌ని నడిపించే అవకాశం ఉంది.

ఫ్యామిలీ రీజన్స్‌తో తొలి వన్డేకి రోహిత్ దూరమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతకీ రోహిత్ ఎందుకు దూరంగా ఉంటున్నాడంటే? అతని భార్య రితికా సోదరుడి వివాహం ముంబయిలో జరుగుతోంది. ఈ పెళ్లికి హాజరవ్వాల్సి ఉండటంతో తాను తొలి వన్డేలో ఆడలేనని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కెప్టెన్ రోహిత్ శర్మ లేఖ రాశాడట. దాంతో బీసీసీఐ కూడా పర్మీషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివాహ వేడుకలకి రోహిత్ శర్మ హాజరవగా.. అతని భార్య సోషల్ మీడియాలో కొన్ని ఫొటోల్ని కూడా షేర్ చేసింది.

రోహిత్ శర్మ స్థానంలో తొలి వన్డేలో ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. అతనితో కలిసి శుభమన్ గిల్ భారత్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక టీ20ల్లో ఇప్పటికే జట్టుని నడిపిస్తున్న హార్దిక్ పాండ్య.. తొలిసారి వన్డేల్లో కెప్టెన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల సిరీస్‌కి ఎంపికవని హార్దిక్ పాండ్య.. దాదాపు నెల రోజులు రెస్ట్ తీసుకుని మళ్లీ మ్యాచ్‌లు ఆడబోతున్నాడు. ఆదివారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుండగా.. ఆ మ్యాచ్‌ టైమ్‌కి హిట్‌మ్యాన్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news