Friday, March 31, 2023

ఉత్కంఠ మ్యాచ్‌‌.. చివరి ఓవర్‌లో 22 రన్స్‌ చేసి గెలిపించిన యూపీ అమ్మాయి

మహిళల ప్రీమియర్ లీగ్ ఆసక్తికరంగా సాగుతోంది. టోర్నీలో మూడో మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠ రేపి అభిమానులకు మంచి వినోదాన్ని పంచింది. యూపీ వారియర్స్ జట్టు అమ్మాయి గ్రేస్ హ్యారీస్ (59 పరుగులు, 26 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుతంగా ఆడి చివరి ఓవర్‌లో జట్టును గెలిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ జట్టు యూపీ వారియర్స్‌కు 170 పరుగుల లక్ష్యం నిర్దేశించగా.. గ్రేస్ హ్యారీస్, కిరణ్ నవ్‌గిరే రాణించడంతో 7 వికెట్లు నష్టపోయి ఒక బంతి మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేసింది. గుజరాత్ జెయింట్స్ గెలుపు ఖాయం అనుకున్న దశలో.. గ్రేస్ హ్యారీస్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అవతలి ఎండ్‌లో వికెట్లు పడుతున్నా ఒంటరి పోరు చేసి జట్టును గెలిపించింది. చివరి ఓవర్‌లో లక్ష్యానికి 19 పరుగులు కావాల్సి ఉండగా.. గ్రేస్ హ్యారీస్ 2 సిక్సులు, 2 ఫోర్లు బాదింది. ఐదో బంతికి విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో గ్రేస్ హ్యారిస్ ‘సిక్స్’ కొట్టి యూపీ వారియర్స్ శిబిరంలో ఉత్సాహం నింపింది. సుథర్‌లాండ్ వేసిన ఆ ఓవర్‌లో మొత్తం 24 పరుగులు వచ్చాయి.

గ్రేస్ హ్యారీస్‌తో పాటు అర్ధశతకంతో రాణించిన కిరణ్ నవ్‌గిరే (53 పరుగులు, 43 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) యూపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. చివర్లో సోఫీ (22 పరుగులు, 12 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా దూకుడుగా ఆడటంతో యూపీ వారియర్స్ అద్భుత విజయం సాధించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హర్లీన్‌ డియోల్‌ 46 పరుగులు (32 బంతుల్లో, 7 ఫోర్లు) చేయడంతో ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. సబ్బినేని మేఘన 24 (15 బంతుల్లో, 5 ఫోర్లు) పరుగులు, ఆష్లీన్‌ గార్డెనర్ 25 (19 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు చేశారు.హేమలత 21 (13 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఒక దశలో గుజరాత్ గెలుపు ఖాయమే అనిపించింది. చివరి ఓవర్లలో గ్రేస్ హ్యారీస్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. యూపీ వారియర్స్ జట్టు బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్ చెరో 2 వికెట్లు తీయగా.. తాహిలా మెక్‌గ్రాత్, అంజలి చెరో వికెట్ పడగొట్టారు.

గుజరాత్ జెయింట్స్‌ అమ్మాయి కిమ్ గార్త్ 5 వికెట్లు పడగొట్టగా.. అన్నాబెల్ సుథర్‌లాండ్, మాన్సీ జోషీ తలో వికెట్ తీశారు. గ్రేస్ హ్యారీస్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. ఈ టోర్నీలో గుజరాత్ జెయింట్స్‌కు ఇది రెండో ఓటమి. తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం పాలైంది.

చేపలకు ఆహారం తినిపిస్తున్న బాతు.. ఎంత ప్రేమ! క్యూట్ వీడియో

Latest news
Related news