మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) చూస్తుంటే.. ఆడుతోంది అమ్మాయిలేనా అనిపిస్తోంది. పురుషుల ఐపీఎల్ మాదిరిగానే ఈ టోర్నీలో పరుగుల వరద పారుతోంది. తొలి మ్యాచ్లోనే ముంబయి ఇండియన్స్ 207 రన్స్ చేసి ఔరా అనిపించగా.. లీగ్ రెండో మ్యాచ్లోనే ఢిల్లీ జట్టు (DCw) ఆ రికార్డును బద్దలుకొట్టింది. ఏకంగా 223 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBw)తో జరిగిన మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఢిల్లీ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ కేవలం 43 బంతుల్లో 72 పరుగులు (14 ఫోర్లు) చేయగా.. షఫాలీ వర్మ కేవలం 45 బంతుల్లోనే 84 పరుగులు (10 ఫోర్లు, 4 సిక్స్లు) చేసింది. ఒక దశలో సెంచరీ చేసేట్లు కనిపించిన వీరిద్దరూ చివరికి ఒకే ఓవర్లో ఔటయ్యారు. చివర్లో దూకుడుగా ఆడిన.. మెరిజన్నే 39* (17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 22* (15 బంతుల్లో, 3 ఫోర్లు) పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది.
మెగ్ లానింగ్, షఫాలీ అద్భుత ఇన్నింగ్స్తో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు చేసింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది.
బెంగళూరు జట్టులో కెప్టెన్ స్మృతి మంధాన 35 (23 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్స్), హీథర్ నైట్ 34 (21 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్లు), ఎలిసే పెర్రీ 31 (19 బంతుల్లో, 5 ఫోర్లు), మెగన్ స్కట్ 30 (19 బంతుల్లో, 5 ఫోర్లు) పరుగులు చేశారు. ఆ తర్వాత గరిష్ట స్కోరు 14 (సోఫీ డెవిన్) పరుగులు మాత్రమే.
ఢిల్లీ బౌలర్ టారా నోరిస్ ఏకంగా 5 వికెట్లు తీసి బెంగళూరు ఓటమిని శాసించింది. ఎలిస్ కాప్సే 2 వికెట్లు పడగొట్టింది. శిఖా పాండేకు ఒక వికెట్ దక్కింది. బెంగళూరు బౌలర్లలో హీథర్ నైట్ మాత్రమే 2 వికెట్లు పడగొట్టింది. రేణుకా సింగ్ సహా మిగతా బౌలర్లెవరికీ వికెట్లు దక్కలేదు.
జై శ్రీరామ్ ప్రభూ.. ఈ విశ్వానికి మీరే శక్తి: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ పోస్టు వైరల్
నిద్రలేమి, మారిన అలవాట్లు.. ఆకస్మిక ‘గుండెపోటు’కు కారణాలివే..!