Friday, March 31, 2023

Babar Azam | భారత్ గడ్డపైకి ఈ ఏడాది పాకిస్థాన్ టీమ్ వస్తుందా? క్లారిటీ ఇచ్చేసిన కెప్టెన్ బాబర్

భారత్ గడ్డపై ఈ ఏడాది అక్టోబరు – నవంబరులో జరగబోతున్న వన్డే ప్రపంచకప్‌ 2023(ODI World Cup 2023)లో ఆడేందుకు పాకిస్థాన్ టీమ్ వస్తుందా? అంటే పాక్ నుంచి ఇప్పటి వరకూ సరైన సమాధానం లేదు. ఈ ఏడాది పాక్ గడ్డపై జరిగే ఆసియా కప్ -2022లో ఆడేందుకు భారత్ జట్టుని అక్కడికి పంపబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే క్లారిటీగా చెప్పేసింది. ఒకవేళ ఆ టోర్నీని పాక్‌లో కాకుండా తటస్థ వేదికలో ఎక్కడ నిర్వహించినా.. భారత్ జట్టు ఆడుతుందని కూడా బీసీసీఐ పెద్దలు స్పష్టం చేశారు. కానీ.. భారత్‌ జట్టు తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబడుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. ఒకవేళ టీమ్‌ని పంపకపోతే వన్డే ప్రపంచకప్ కోసం తాము కూడా జట్టుని భారత్‌కి పంపబోమని హెచ్చరిస్తోంది.

కానీ.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ భారత్ గడ్డపైకి వన్డే ప్రపంచకప్ -2023లో ఆడేందుకు పాక్ జట్టు వస్తుందని ఈరోజు సంకేతాలు ఇచ్చాడు. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న బాబర్ అజామ్ (Babar Azam) మాట్లాడుతూ ‘‘భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌‌పై మేము ఫోకస్ పెడుతున్నాం. ఆ టోర్నీలో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి స్కోర్స్ చేసేందుకు ట్రై చేస్తా. పాక్ టాప్ ఆర్డర్ మంచి కాంబినేషన్‌తో ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. దాంతో వన్డే ప్రపంచకప్ -2023లో ఆడేందుకు పాక్ సముఖంగానే ఉన్నట్లు తేలిపోయింది.

ముంబయిలో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ గడ్డపై టీమిండియా పర్యటించడం లేదు. భారత్ జట్టు చివరిగా దాయాది దేశంలో 2008లో ఆసియా కప్ ఆడింది. ఆ తర్వాత కేవలం ఐసీసీ, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా జరగడం లేదు. భద్రతా కారణాలను చూపుతూ భారత్ జట్టుని అక్కడికి పంపేందుకు బీసీసీఐ విముఖత వ్యక్తం చేస్తోంది.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news