Tuesday, March 21, 2023

Ahmedabad Test | ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి అహ్మదాబాద్ టెస్టుని చూడబోతున్న ప్రధాని మోడీ

India-Australia Test at Narendra Modi stadium: భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 9 నుంచి అహ్మదాబాద్ (Ahmedabad ) వేదికగా ప్రారంభంకానున్న నాలుగో టెస్టుని లైవ్‌లో వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రాబోతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా పేరొందిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ (Narendra Modi) స్టేడియం (Narendra Modi stadium) ఈ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వబోతోంది. సుమారు 63 ఎకరాల్లో ఆధునిక సదుపాయాలతో ఈ స్టేడియాన్ని నిర్మించారు.

ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 1,10,000కాగా.. అక్కడ గత ఏడాది జరిగిన ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్‌‌ని ఏకంగా 1,01,566 మంది వీక్షించారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ప్రత్యక్షంగా క్రికెట్ మ్యాచ్‌ని వీక్షించిన స్టేడియంగా గిన్నిస్ రికార్డ్‌ని కూడా సొంతం చేసుకుంది. వాస్తవానికి ఈ స్టేడియం అసలు పేరు మొతెరా స్టేడియం. కానీ.. గుజరాత్ క్రికెట్ అసోషియేషన్ (జీసీఏ) ఈ స్టేడియాన్ని ఆధునీకరించిన తర్వాత నరేంద్ర మోడీ స్టేడియంగా పేరుని మార్చింది. ఈ పేరు మార్పుపై అప్పట్లో బీజేపేతర పార్టీల నుంచి విమర్శలు కూడా వచ్చాయి.

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే నాగ్‌పూర్, ఢిల్లీ, ఇండోర్ వేదికగా మూడు టెస్టు మ్యాచ్‌లు ముగియగా.. తొలి రెండు టెస్టుల్లో భారత్ జట్టు గెలిచింది. అయితే.. మూడో టెస్టులో గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ సిరీస్‌లో 1-2తో పుంజుకుంది. ఇక నాలుగో టెస్టు మ్యాచ్‌లో గెలుపు ఆస్ట్రేలియా కంటే భారత్‌కే ఎక్కువ అవసరం. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి చేరాలంటే భారత్ జట్టు ఈ అహ్మదాబాద్ టెస్టులో తప్పక విజయం సాధించాల్సి ఉంది. దాంతో మ్యాచ్ కూడా ఆసక్తిగా జరిగే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ స్టేడియంలో మొత్తం 11 పిచ్‌లు ఉండగా.. ఏ పిచ్‌పై మ్యాచ్ ఆడిస్తారో చూడాలి. ఇప్పటి వరకు జరిగిన తొలి మూడు టెస్టుల్నీ స్పిన్ పిచ్‌లపైనే ఆడించారు.

Latest news
Related news