ఈ సారి కూడా ఎంసెట్ మార్కులతోనే ర్యాంకు
గత మూడేళ్లుగా ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వడం లేదని, ఈసారి కూడా ఉండదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ‘‘ఎంసెట్ మార్కులతోనే ర్యాంకు కేటాయిస్తాం. అందుకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. జేఈఈ మెయిన్, నీట్, ఇతర ఏ ప్రవేశ పరీక్షల్లోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వడం లేదు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని నిపుణుల కమిటీతో పరిశీలించి తెలంగాణ ఎంసెట్లో వెయిటేజీని తొలగించాం. ప్రస్తుతానికి ఈ ఒక్క ఏడాది విషయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.
కరోనా కారణంగా 2020 నుంచి ఇంటర్లో పర్సంటేజీతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించాం. ఈసారి ఇంటర్మీడియట్లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్ ఫస్టియర్లో 70 శాతం సిలబస్ ఆధారంగానే ఎంసెట్లో ప్రశ్నలు ఇస్తాం. రెండో ఏడాదిలో మాత్రం 100 శాతం సిలబస్ ఉంటుంది. పూర్తి సిలబస్ను త్వరలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతాం. బీఎస్సీ నర్సింగ్లో చేరాలనుకున్న విద్యార్థులు ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్ష తప్పనిసరిగా రాసి అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ మేరకు కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం లేఖ రాసింది’’ అని లింబాద్రి వివరించారు. ఎంసెట్ నిర్వహణకు తెలంగాణలో 16 పరీక్షా జోన్లు ఏర్పాటు చేస్తారు. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు నగరాల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఎంసెట్ రిజిస్ట్రేషన్ షెడ్యూల్
- ఫిబ్రవరి 28 : నోటిఫికేషన్ విడుదల
- మార్చి 3- ఏప్రిల్ 10 వరకు: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణ ఉంటుంది.
- ఏప్రిల్ 12-14 వరకు: దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం ఇస్తారు.
- ఏప్రిల్ 15- మే 2 వరకు: రూ.250 నుంచి రూ.5 వేల వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తారు.
- ఏప్రిల్ 30 నుంచి: డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లో హాల్టికెట్ల అందుబాటులో ఉంటాయి
- ఎంసెట్ పరీక్షలు: మే 7, 8, 9 తేదీల్లో ఇంజినీరింగ్; 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి.
- దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500; ఇతరులకు రూ.900 గా నిర్ణయించారు.
- దరఖాస్తులకు వెబ్సైట్:https://eamcet.tsche.ac.in/