Sunday, April 2, 2023

Taraka Ratna: తారకరత్న పెద్ద కర్మకు తేదీ ఖరారు చేసిన బాలకృష్ణ, విజయసాయి

సినీ నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) పెద్ద కర్మ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు తేదీ ఖరారు చేశారు. మార్చి 2వ తేదీన తారకరత్న పెద్ద కర్మ జరగనుంది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో మార్చి 2న మధ్యాహ్నం 12 గంటల నుంచి పెద్ద కర్మ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పెద్ద కర్మ కార్యక్రమం గురించి తెలియజేయడానికి కుటుంబ సభ్యులు కార్డును ముద్రించారు. కార్డుపై శ్రేయోభిలాషులుగా తారకరత్న చిన్నాన్న నందమూరి బాలకృష్ణ (Balakrishna), తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి పెదనాన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy) పేర్లను ముద్రించారు.

తారకరత్న కుప్పంలో గుండెపోటుకు గురైనప్పటి నుంచీ హైదరాబాద్‌లో ఆయన అంత్యక్రియలు ముగిసేంత వరకు బాబాయ్ బాలకృష్ణ అన్నీ తానై చూసుకున్నారు. అలాగే, విజయసాయిరెడ్డి సైతం తారకరత్న ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి కుటుంబం కోసం బాలకృష్ణతో కలిసి పెద్దరికాన్ని ప్రదర్శించారు. బాలయ్య, విజయసాయిరెడ్డి ఇద్దరూ కలిసి అన్నీ కార్యక్రమాలను చూసుకున్నారు. ఆఖరికి పొద్దున్నే లేస్తే చంద్రబాబును ట్విట్టర్ ద్వారా దారుణంగా తిట్టే విజయసాయిరెడ్డి.. తారకరత్న అంత్యక్రియల సమయంలో చంద్రబాబు పక్కనే కూర్చొని ఆయనతో మాట్లాడారు.

Taraka Ratna Pedda Karma

తారకరత్న పెద్ద కర్మ కార్డు

తారకరత్న అంత్యక్రియల సమయంలో విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరును చాలా మంది మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో అయితే బాలకృష్ణ-విజయసాయిరెడ్డి, చంద్రబాబు-విజయసాయిరెడ్డి ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే, ఇప్పుడు మరోసారి తారకరత్న పెద్ద కర్మ సందర్భంగా బాలకృష్ణ, విజయసాయి రెడ్డి కలవబోతున్నారు.

తారకరత్న అకాల మరణం
నందమూరి కుటుంబం నుంచి వచ్చినా సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయిన తారకరత్న.. రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా తన తాతయ్య నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జనంలో ఉండాలని భావించిన తారకరత్న.. తన బావ, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ చేపట్టిన యుగళం పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభమైన రోజునే కుప్పం సమీపంలో కార్యకర్తలతో కలిసి నడుస్తుండగా తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చింది.

పాదయాత్రలో కుప్పకూలిన తారకరత్నను కుప్పంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కుప్పంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉందని భావించిన వైద్యులు.. ఆయన్ని అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ విదేశీ వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అందించారు. 23 రోజుల పాటు అక్కడ చికిత్స పొందిన తారకరత్న కోలుకోలేకపోయారు. ఫిబ్రవరి 18న నారాయణ హృదయాలయలో తుదిశ్వాస విడిచారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఫిబ్రవరి 21న తారకరత్న అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Latest news
Related news