Tuesday, October 3, 2023

పాక్‌పై ఇంగ్లాండ్ విజయం.. టీమిండియాకు కలిసి రానుందిలా..!

రావల్పిండి టెస్టులో అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్‌పై విజయం సాధించిన ఇంగ్లాండ్.. ఆతిథ్య జట్టుకు షాకిచ్చింది. వన్డే తరహా ఆటతో వేగంగా ఆడిన ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు ఊహించని రీతిలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. పాక్ ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లాండ్.. ఆఖరి రోజు చివరి సెషన్లో విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ విజయం భారత్‌కు ఉపయోగపడనుంది. అదేలా అనుకుంటున్నారా..? ఇంగ్లిష్ జట్టు విజయంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలు మెరుగయ్యాయి.

ఈ టెస్ట్‌కు ముందు పాకిస్థాన్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పాక్ జట్టు సొంత గడ్డ మీద ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లతో ఐదు టెస్టులు ఆడనుంది. రావల్పిండి టెస్టులో పాకిస్థాన్ విజయం సాధిస్తే.. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న బాబర్ ఆజమ్ టీమ్ పాయింట్ల పట్టికలో మరింత ముందుకెళ్లేది. కానీ ఇంగ్లాండ్ గెలవడం భారత్, ఆస్ట్రేలియా‌లకు కలిసిరానుంది.

రోహిత్ సేన బంగ్లాదేశ్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే.. సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాతో ఒక టెస్టు ఓడినా సరే.. ఫైనల్ చేరగలుగుతుంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే… ఆ జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసి.. సౌతాఫ్రికాను ఓడిస్తే.. ఆ జట్టు కూడా ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ సౌతాఫ్రికా ఆసీస్‌ను ఓడిస్తే మాత్రం సఫారీ జట్టు ఫైనల్ చేరే అవకాశాలు మెరుగవుతాయి.

పాకిస్థాన్ ఇప్పటికీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కానీ రాబోయే టెస్టు సిరీస్‌ల్లో భారత్, ఆస్ట్రేలియాలు విజయాలు సాధిస్తే.. బాబర్ సేన పాయింట్ల పట్టికలో పడిపోయే అవకాశం ఉంది.

సొంత గడ్డ మీద ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భారత్ 4-0 లేదా 3-0 తేడాతో గెలిస్తే.. డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానానికి చేరుకుంటుంది. భారత్ ఫైనల్ చేరే అవకాశం సొంత ప్రదర్శనతోపాటు.. న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్ ఫలితంపైనా ఆధారపడి ఉంటుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా.. సౌతాఫ్రికా రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో, భారత్ నాలుగో స్థానంలో ఉన్నాయి. పాక్ 5, వెస్టిండీస్ 6, ఇంగ్లాండ్ 7వ స్థానంలో ఉన్నాయి.

బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక.. బజ్‌బాల్ క్రికెట్ విధానాన్ని ఫాలో అవుతోన్న ఇంగ్లాండ్.. ఇటీవలి కాలంలో అద్భుత విజయాలు సాధిస్తోంది. రావల్పిండి టెస్టులో విజయంతో పాక్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. వెలుతురు తగ్గుతుండటంతో.. చివరి రోజు ఆట మరో 10 నిమిషాల్లో ముగుస్తుందనగా చివరి వికెట్ తీసిన ఇంగ్లాండ్.. పాక్ గడ్డ మీద ఓవరాల్‌గా మూడో టెస్టు విజయాన్ని అందుకుంది.

Read More Sports News And Telugu News

Latest news
Related news