Tuesday, October 3, 2023

#RRRMovie: ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఖాతాలో మరో ప్రెస్టీజియస్ అవార్డ్

‘బాహుబలి’ మూవీ రెండు భాగాలతో దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి.. ‘ఆర్‌ఆర్ఆర్’(#RRRMovie) మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించిన ఈ చిత్రం యూఎస్, జపాన్‌లోనూ సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శిచబడుతోంది. ఇక ఇందుకు సంబంధించి ప్రమోషన్స్‌లో మూవీ టీమ్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ‘ఆర్ఆర్ఆర్’(RRR) చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండుతోంది. ఇటీవలే రాజమౌళి(Rajamouli)కి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ వరించింది.

ఇదిలా ఉంటే, తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ‘కాస్ట్ అండ్ క్రూ.. ప్రెస్టీజియస్ HCA స్పాట్‌లైట్ విన్నర్ అవార్డ్ పొందింది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని గుర్తించినందుకు HCA క్రిటిక్స్ జ్యూరీకి మూవీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. దీంతో పాటు అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (AFCC)అవార్డ్స్ 2022లోనూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మరో గౌరవాన్ని పొందింది. బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ కేటగిరీలో అవార్డ్ సొంతం చేసుకుంది. AFCC.. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది.

నిజానికి దర్శకుడు రాజమౌళి, లీడ్ యాక్టర్స్ ఎన్టీఆర్, రాంచరణ్‌తో పాటు మూవీ టీమ్ మొత్తం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. పాండమిక్ పరిస్థితులను తట్టుకుని మరీ ఆడియన్స్‌కు విజువల్ ట్రీట్ ఇవ్వాలనే లక్ష్యంతో మంచి అవుట్ పుట్ కోసం కాంప్రమైజ్ కాకుండా శ్రమించారు. మ్యూజిక్ దగ్గరి నుంచి మైనర్ డీటెయిలింగ్ వరకు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వెండితెరపై విజువల్ ఫీస్ట్ అందించారు. ఈ క్రమంలోనే తమ కష్టానికి ప్రపంచ వేదికపై గుర్తింపు దక్కడం పట్ల మూవీ టీమ్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ హవా చూస్తుంటే.. 2023 ఆస్కార్ నామినేషన్స్‌లోనూ ఆర్ఆర్ఆర్ అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి ఒక తెలుగు సినిమా ప్రపంచ దేశాల్లో కమర్షియల్‌గా కాసులు కురిపించడంతో పాటు అవార్డులు కొల్లగొట్టడం పట్ల తెలుగు సినీ అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయబోయే సినిమా కోసం కథ సిద్ధ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాపైనా భారీ అంచనాలే నెలకొన్నాయి. మరోవైపు ఎన్టీఆర్.. కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక రాంచరణ్.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఇటీవలే న్యూజిలాండ్‌లో పాట చిత్రీకరించారు. ఇదేగాక ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో మరో సినిమా కమిట్ అయ్యాడు చెర్రీ.

Latest news
Related news