KL Rahul: బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ చెత్త బ్యాటింగ్ కారణంగా ఓటమిపాలైంది. బ్యాటర్లు చేతులెత్తేసినప్పటికీ.. 187 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో బౌలర్లు శక్తి మేరా పోరాడారు. కానీ నో బాల్స్ వేయడం, ఫీల్డర్లు క్యాచ్లను సరిగా అందుకోలేకపోవడం కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. కీలక సమయంలో కేఎల్ రాహుల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన మెహిదీ హసన్ తర్వాత తెలివిగా ఆడి బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు.

ప్రధానాంశాలు:
- బంగ్లాతో మ్యాచ్లో తేలిపోయిన భారత బ్యాటర్లు
- బ్యాటింగ్లో ఆదుకున్న రాహుల్
- వికెట్ కీపర్గా మాత్రం విఫలం
కానీ అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టారు. దీంతో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ పోరాటం మరి కాసేపట్లో ముగుస్తుందనిపించింది. కానీ చేతుల్లో పడిన క్యాచ్ను వదిలేసిన వికెట్ కీపర్ కేఎల్ రాహుల్.. చివరకు వదిలేసింది క్యాచ్ను కాదు మ్యాచ్ను అని నిరూపించాడు.
శార్దుల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 42.3వ ఓవర్లో మెహిదీ హసన్ బంతిని గాల్లోకి లేపాడు. బాగా ఎత్తు వెళ్లిన బంతిని అందుకునే క్రమంలో రాహుల్ తత్తరపాటుకు లోనయ్యాడు. బంతి చేతుల్లో పడినప్పటికీ దాన్ని ఒడుపుగా అందుకోలేకపోయాడు. ఈ లైఫ్ బంగ్లాదేశ్కు వరమైంది. అలాగని మిగతా ఆటగాళ్లు తప్పిదాలు చేయలేదని కాదు గానీ.. రాహుల్ జారవిడిచిన క్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పింది.
చివరి వికెట్కు ముస్తాఫిజుర్ రెహ్మాన్ (11 బంతుల్లో 10)తో కలిసి 51 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మెహిదీ హసన్ (39 బంతుల్లో 38) మ్యాచ్ను భారత్ నుంచి లాగేసుకున్నాడు. దీంతో గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా చేజేతులా ఓడింది.
బ్యాటింగ్లోనూ రాహుల్ తొందరపాటు..
అంతకు ముందు మిగతా బ్యాటర్లు చేతులెత్తేయగా.. కేఎల్ రాహుల్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లు 30 పరుగులు కూడా చేయలేకపోయిన పిచ్ మీద.. రాహుల్ 71 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. బ్యాటింగ్లోనూ రాహుల్ తెలివిగా ఆడలేకపోయాడు. టీమిండియా 158 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడంతో.. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే ఉద్దేశంతో బంగ్లా బౌలర్లపై రాహుల్ ఎదురు దాడికి దిగాడు. ఎబాదత్ బౌలింగ్లో ఓ సిక్స్, ఫోర్ బాదిన రాహుల్.. మరో భారీ షాట్కు యత్నించి పెవిలియన్ చేరాడు. అప్పటికీ మరో 10 ఓవర్ల ఆట మిగిలి ఉంది. టెయిలెండర్ల అండతో.. ఓవర్ అంతా తాను ఆడి ఐదు లేదా ఆరో బంతికి సింగిల్ తీసేలా ప్లాన్ ప్రకారం ఆడి ఉండుంటే.. భారత్ 200కిపైగా పరుగులు చేసి ఉండేది. కానీ టెయిండర్లను నమ్మలేకపోయిన రాహుల్ దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ చేజార్చుకున్నాడు. ఇది కూడా టీమిండియాకు మైనస్ అయ్యింది. మొత్తానికి ఈ మ్యాచ్లో భారత్ను నిలబెట్టిన ఆటగాడే.. చివరికి ఓటమికి కారణమయ్యాడు.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.