Tuesday, March 21, 2023

BCCI పంత్‌ను రిలీజ్ చేయడానికి అసలు కారణం ఇదేనట!

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేకు ముందు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను రిలీజ్ చేస్తున్నట్లు బీసీసీఐ చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యపరిచింది. మెడికల్ టీంతో సంప్రదింపుల తర్వాత పంత్‌ను వన్డే సిరీస్ నుంచి రిలీజ్ చేశామని బోర్డు ట్వీట్ చేసింది. దీంతో రిషబ్‌కు గాయమైందా..? లేదా మరేదైనా కారణమా అనే ప్రశ్న అందరి మదిలో మెదిలింది. క్రమశిక్షణా చర్యలు ఏమైనా తీసుకున్నారా లేదంటే కోవిడ్-19 ఏమైనా కారణమా అనే చర్చ కూడా జరిగింది. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సైతం పంత్ విషయం తనకేం తెలియదని చెప్పడం విస్మయానికి గురి చేసింది.

‘నిజాయతీగా చెప్పాలంటే.. నాకు పంత్ విషయం పూర్తిగా తెలీదు’ అని తొలి వన్డే ముగిశాక రాహుల్ తెలిపాడు. ‘నిజాయతీగా చెబుతున్నా.. పంత్‌ను రిలీజ్ చేస్తున్న విషయం నాకు డ్రెస్సింగ్ రూమ్‌లోనే తెలిసింది. దానికి కారణాలేంటో తెలీదు. బహుశా ఈ ప్రశ్నకు మెడికల్ టీం మెరుగైన సమాధానం ఇస్తుందేమో’ అని రాహుల్ వ్యాఖ్యానించాడు.

కాగా వన్డే సిరీస్ నుంచి తనను రిలీజ్ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ను పంత్ కోరాడని క్రిక్ బజ్ వెల్లడించింది. ‘న్యూజిలాండ్ నుంచి ఢాకా వచ్చాక కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పంత్ మాట్లాడాడు. ఢాకాలో ఒక రోజు ఉన్న పంత్.. లీవ్ కోరడానికి ముందు నెట్స్ ప్రాక్టీస్ కూడా చేశాడు’ అని క్రిక్ బజ్ పేర్కొంది.

పంత్ ఇలా అడగానికి కచ్చితమైన కారణమేంటో చెప్పడానికి ఇష్టపడని బీసీసీఐ వర్గాలు.. క్రమశిక్షణా చర్యలు మాత్రం కారణం కాదని తెలిపాయి. డిసెంబర్ 14న మొదలయ్యే టెస్ట్ సిరీస్‌కు పంత్ అందుబాటులోకి వస్తాడని మేనేజ్‌మెంట్ నమ్మకంతో ఉంది. ఇషాన్ కిషన్ వన్డే జట్టులో ఉండటంతో మేనేజ్‌మెంట్ పంత్‌కు రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు. న్యూజిలాండ్ పర్యటనలో పంత్ విఫలం కావడంతో నెటిజన్లు యువ క్రికెటర్‌ను ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. బీసీసీఐ కావాలనే సంజూ శాంసన్‌ను పక్కనబెట్టి పంత్‌కు అవకాశాలు ఇస్తోందనే ఆరోపణలొచ్చాయి. బహుశా ఈ కారణంతోనే పంత్ బ్రేక్ తీసుకొని ఉండొచ్చు.

ఇక మిగతా ఆటగాళ్ల విషయానికి వస్తే.. తొలి వన్డేకు అక్షర్ పటేల్ కూడా దూరంగా ఉన్నాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేసే సమయం లో అక్షర్ పక్కటెముకలకు బంతి తగిలిందని, అందుకే తొలి వన్డేకు పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. తర్వాతి మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. భుజం గాయం బారిన పడిన షమీ టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండే విషయంలో స్పష్టత లేదు. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లని షమీ.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. షమీ విషయమై ఎన్‌సీఏ ఇచ్చే ఫీడ్ బ్యాక్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ ఎదురు చూస్తోంది.

Read More Sports News And Telugu News

Latest news
Related news