మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్పై బంగ్లాదేశ్ ఒక వికెట్ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. చివరి వికెట్కు బంగ్లా బ్యాటర్లు మెహదీ హసన్, ముస్తాఫిజుర్ 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆతిథ్య జట్టు అనూహ్య రీతిలో గెలుపొందింది. కానీ ఆ జట్టు స్కోరు 155 పరుగుల వద్ద రాహుల్ క్యాచ్ వదిలేయడం బంగ్లాకు కలిసొచ్చింది.దీంతో నెటిజన్లు రాహుల్ను ట్రోల్ చేస్తుండగా.. సునీల్ గావస్కర్ అతడికి మద్దతుగా నిలిచాడు.

ప్రధానాంశాలు:
- కీలక సమయంలో క్యాచ్ వదిలేసిన కేఎల్ రాహుల్
- నీ వల్లే ఓడామంటూ వికెట్ కీపర్ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
- రాహుల్కు అండగా నిలిచిన గావస్కర్
కాగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ మాత్రం రాహుల్కు అండగా నిలిచారు. రాహుల్ వల్లే ఓడామనడం సరికాదన్నారు. ‘అది చివరి వికెట్… క్యాచ్ అందుకొని ఉండుంటే మ్యాచ్ ముగిసేది. కానీ భారత్ 186 పరుగులే చేసింది. ఆ విషయాన్ని కూడా గమనించాలి. 136 పరుగులకే 9 వికెట్లు పడగొట్టారంటే.. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మెహదీ హసన్ మిరాజ్ తెలివిగా బాగా ఆడాడు, అతడికి అదృష్టం కలిసొచ్చింది. భారత్ 70-80 పరుగులు తక్కువ చేసింది. 250 పరుగులు చేసి ఉండుంటే.. ఆట మరోలా ఉండేది అని సునీల్ గావస్కర్ తెలిపాడు.
‘ఓవర్కు 4 పరుగుల కంటే తక్కువ స్కోర్ చేయాల్సి ఉన్నప్పుడు.. ప్రత్యర్థిపై ఒత్తిడి పెద్దగా ఉండదు. భారత్ మరో 70-80 రన్స్ తక్కువ చేయడం వల్ల ఓడింది. అదే ఓటమికి కారణం’ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్లో మెహదీ హసన్ 38 బంతుల్లో 39 పరుగులు చేయడంతో బంగ్లా ఒక్క వికెట్ తేడాతో భారత్పై థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మెహదీ హసన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది.
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.