364 పరుగుల లక్ష్యంతో ఆఖరి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 80 పరుగులు చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది. చివరి రోజు పాకిస్థాన్ విజయానికి 263 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలవాలంటే 8 వికెట్లు పడగొట్టాల్సిన పరిస్థితి. చివరి రోజు ఆట ఆరంభంలోనే ఇమామ్ ఉల్ హక్ వికెట్ తీసిన ఇంగ్లండ్ బౌలర్లు పాక్ను ఒత్తిడిలోకి నెట్టార. అయితే, ఆ తర్వాత రిజ్వాన్ (46), షకీల్ (76) జోడీ నాలుగో వికెట్కు 87 పరుగులు జోడించి సవాల్ విసిరింది.
ఆ తర్వాత రిజ్వాన్, షకీల్ ఇద్దరూ 22 పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో.. 198 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పాక్ ఒత్తిడిలో పడింది. ఆ తర్వాత అజహర్ అలీ, అఘా సల్మాన్ జాగ్రత్తగా ఆడినట్లే కనిపించినా.. ఆ తర్వాత తడబడ్డారు.
చివరి రోజు చివరి సెషన్లో ఇంగ్లండ్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్ పిచ్పై బంతిని ఇరువైపులా స్వింగ్ రాబట్టి ఫలితం సాధించారు. ఇంగ్లండ్ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ఆ జట్టు ప్రధాన పేసర్లు అండర్సన్, రాబిన్సన్ తలో 4 వికెట్లు తీసి పాక్ జట్టు పతనాన్ని శాసించారు. పాక్ గడ్డపై ఇంగ్లాండ్కు ఇది కేవలం మూడో టెస్టు మ్యాచ్ విజయం కావడం గమనార్హం.
ఇంగ్లండ్ జట్టుకు ఇది కచ్చితంగా సంచలన విజయమేనని చెప్పాలి. అత్యంత నిస్సారమైన పిచ్పై ఫలితాన్ని రాబట్టేందుకు వారు సాహసమే చేశారు. 10 వికెట్లకు తగినంత సమయం కావాలనే ప్రయత్నంలో గెలుపును పణంగా పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. అనుకున్న సమయంలో చివరి వికెట్ను నేలకూల్చి గెలుపు సంబరాల్లో మునిగిపోయారు. నరాలు తెగే ఈ నాటకీయత మధ్య పాకిస్థానీ ప్రేక్షకులు ఓటమి భారంతో తల్లడిల్లారు.